కరోనా: 4 రోజుల్లో రూ.19.49 లక్షల కోట్లు ఆవిరి

 ముంబై: కోవిడ్‌-19 భయాలతో దలాల్‌ స్ట్రీట్‌ గజగజ వణుకుతోంది. కరోనావైరస్ మహమ్మారి ప్రపంచ మార్కెట్లతోపాటు, దేశీయ స్టాక్‌మార్కెట్లను అతలాకుతలం చేస్తోంది. దీంతో ఈ వారంలో కూడా కీలక సూచీలు తీవ్ర  నష్టాలను మూటగట్టుకున్నాయి. వరుస నష్టాలతో లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద తుడిచిపెట్టుకు పోయింది. ముఖ్యంగా  ఈ వారంలో నాలుగు రోజుల వ్యవధిలో రూ.19.49 లక్షల కోట్ల విలువైన పెట్టుబడిదారుల సంపద ఆవిరైపోయింది. దీనికితోడు భారతదేశంలో పెరుగుతున్న కరోనావైరస్ కేసులు, మరణాలు ఇన్వెస్టర్లలో తీవ్ర నిరాశను నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ట్రేడింగ్‌లో ఆరంభంలోనే నష్టాల బాట పట్టాయి. మిడ్‌ సెషన్‌లో కొంత పుంజుకున్నప్పటికీ, ప్రధాన మద్దతు స్థాయిలను నిలబెట్టుకోవడంలో వైఫల్యం చెందాయి. అయితే షార్ట్‌ కవరింగ్‌ ప్రభావంగానే రికవరీ వచ్చిందనీ, ఇన్వెస్టర్ల అప్రమత్తత రానున్న కాలంలో కొనసాగుతుందని ఎనలిస్టులు విశ్లేషిస్తున్నారు.